Pages

30 October 2012

A ది (వ్య)మార్గం


ఏదైతే వద్దనబడిందో,
అదే అద్భుతమవుతుందిపుడు,
ఏదైతే ఆచరించబడకూడదో,
అదే దివ్యమార్గమై,
ఆరాధించబడుతుందిప్పుడు.
 పేరుకుపోతున్న వికృతత్వాలకు
ఒక ముసుగుకావల్సినప్పుడు,
కొత్తరూపాల్లో,
సృజనాత్మక అచ్చుల్లో, మూసల్లో,
అన్ని అవలక్షణాలిప్పడు,
తెంపరితనంతో, కొత్త కత్తులై మెరుస్తు,కరుస్తూ,
రక్తాన్ని రుచిచూస్తున్నట్లున్నాయ్.
బ్రష్టుపట్టిన భావాలిప్పుడు,
బంగారు బొమికలై,
మరమనుషుల నోళ్ళల్లో,
తళతళా మెరుస్తున్నాయ్.
సరసంగా ఆశపెట్టి,
వరసగా ఒక్కోక్కరికి,
నేరుగా విషాన్ని నరాల్లోకి, నెట్టేస్తున్నట్లున్నాయ్.
చూడకూడని దాన్ని,
బయటవేలాడేసుకునే,దిష్టిబొమ్మలే,
దేవతామూర్తులై స్తుతించబడుతున్నాయిప్పుడు.
తప్పొప్పులు తుంగలోతొక్కి,
ఏదైతే పొగడబడుతుందో,
అదే పదిమందికీ దారవుతుంది,
వికృతత్వమే పరమపవిత్రమౌతుంది.
తప్పనిసరై తప్పు చేసేవాడు,
తడబడి దొరకిపోతుంటాడు,
తప్పే బతుకై  బతికేవాడు,
దొరై దబాయించేస్తుంటాడు.
ఏ ఇజానికి లొంగని వాడు,
వంటరౌతాడిక్కడ.
ఏ గుడారంలోకో దూరితే,
అదృష్టం వరిస్తే,
అధిపతై ఏలచ్చిక్కడ.

29 October 2012

అక్షరాల సమ్మె



ఒక ఇష్టమైన భావానికి ,
స్పష్టమైన ఆకృతినిద్దామని,
ఎంత తపనపడ్డా,
ఒక్క అక్షరమైన రూపుదిద్దుకోదేం !
మనసులోని ఆలోచనల
వెల్లువ మొత్తాన్ని,
కొత్తగా ప్రతిబింబిద్దామంటే,
అందంగా ప్రకటిద్దామంటే,
ఏ ఒక్కటి సహకరించదేం !!
స్పందనల సాగరాన్ని,
యథాతధంగా చిత్రిద్దామంటే,
ఎదురు చూడని దోరణిలో,
హరివిల్లులా చూపిద్దామంటే,
ఎంత వెదికినా, ఏ రంగులూ దొరకవేం...

27 October 2012

బ్రిటిష్ ఇండియా నాణేలు - కింగ్ విలియం 4 (1835)


మన దేశంలో నాణేల చరిత్ర లేదా సేకరణ అనగానే దాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించుకోవచ్చు.
1) 1835 కు ముందు ముద్రించబడిన నాణేలు
2) 1835 – 1947 కాలం లో ముద్రించబడిన నాణేలు  
(వీటినే బ్రిటిష్ ఇండియా నాణేలు అంటారు)
3) 1947 తరువాత ముద్రించబడిన నాణేలు 
( వీటిని రిపబ్లిక్ ఇండియా నాణేలు అంటారు.)
ఈ టపాలో బ్రిటిష్ ఇండియా నాణేల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1834 నాటికి  సుమారు భారతదేశమంతా(కొన్ని సంస్థానాలు,ఫ్రెంచ్,డచ్ ప్రాంతాలు కాకుండా) ఈస్టిండియా కంపెనీ వారి పాలన క్రిందకు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. అప్పటికే బ్రిటిష్ వారు నాణేలను ముద్రిస్తున్నప్పటికి, వాటిని మూడు ప్రెసిడెన్సీల నుంచి (మద్రాసు, బొంబాయి,కలకత్తా) మూడు రకాలుగా వెలువడుతుండేవి, వాటి పేర్లు,బరువులు,రూపాలు రకరకాలుగా వుండేవి,(వాటిని గురించి మళ్లీ చెప్పుకుందాం.) మూడు ప్రెసిడెన్సీల నుంచి ఒకే రకమైన నాణేలను ముద్రించాలని నిర్ణయించాక, వాటి బరువు,లోహం,డిజైన్ వీటికి సంబంధించి వేయబడిన కలకత్తా మింట్ కమిటి అనేక సూచనలు చేసింది, అవన్నీ దాదాపుగా అమలు చేయబడ్డాయి, జరిగిన ముఖ్యమైన మార్పు బంగారు, వెండి నాణేల మీద బ్రిటిష్ రాజు బొమ్మని ముద్రించడం. అందువలననే భారతదేశనాణేల చరిత్రలో 1835కు అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. 
అప్పుడు బ్రిటిష్ రాజు కింగ్ విలియం నాలుగు. కమిటిని నియమించింది కూడా ఈయనే. నాణేల మీది రోమన్ అంకెలలో నాలుగుని  IIII ఇలా వేసేవారు.కారణం తెలియదు నాకు.  King william IIII పేరుతో మనకు దొరకే అన్ని నాణేలు పై కూడా 1835 సంవత్సరమే వుంటుంది.
మొత్తం ఐదుగురు రాజుల బొమ్మలతో నాణేలు వెలువడ్డాయి,
1) కింగ్ విలియం – 4 ( 1835 సంవత్సరం లో మాత్రమే ముద్రించబడ్డాయి)
2) క్యీన్ విక్టోరియా (1840 – 1901 వరకు ముద్రించబడ్డాయి)
3) కింగ్ ఎడ్వర్డ్  - 7 (1903 - 1910 వరకు ముద్రించబడ్డాయి)
4) కింగ్ జార్జి – 5(1911 - 1936 వరకు ముద్రించబడ్డాయి)
5) కింగ్ జార్జి – 6 (1938 - 1947 వరకు ముద్రించబడ్డాయి)
కింగ్ విలియం 4 జీవిత విశేషాలు.,
మూడవ జార్జి మూడవ కొడుకైన విలియం హెన్రీ, 1765,ఆగస్ట్ 21 జన్మించాడు. 1831 సెప్టంబర్ 8 న అధికారంలోకి వచ్చిన విలియం 4, 1837,జూన్ 20 మరణించాడు. ఇతని కాలంలో మొత్తం ఎనిమిది రకాల నాణేలు వెలువడ్డాయి.వాటి వివరాలు చూద్దాం.
మొదటి నాణేము.,. డబుల్ మోహర్* 
( బంగారు నాణెం,..ముప్పై రూపాయలకు సమానం)
దీని బరువు 23.32 గ్రాములు,వ్యాసం 32.5 మిల్లీమీటర్లు
దీని బొమ్మ భాగంలో King william IIII తలభాగం వుంటుంది, పైన పేరు,క్రింద సంవత్సరం వుంటుంది.
అచ్చుభాగంలో సింహం, ఈతచెట్టు బొమ్మ వుండేది,.
( మన రిజర్వ్ బ్యాంక్ గుర్తులో సింహం బదులు పులి వుంటుంది.) క్రింద విలువ  ఇంగ్లీష్, ఉర్దూలలో వుంటుంది. పై భాగంలో  ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు ఉంటుంది.
రెండవ నాణేము.,. మోహర్ *
( బంగారు నాణెం,..పదిహేను రూపాయలకు సమానం)
దీని బరువు 11.66 గ్రాములు,వ్యాసం 26 మిల్లీమీటర్లు
(వివరణ డబుల్ మోహర్ లానే) 









మూడవ నాణేము..,.రూపాయి (వెండి నాణేం)
దీని బరువు 11.66 గ్రాములు,వ్యాసం 30.5 మిల్లీమీటర్లు
దీని బొమ్మ భాగంలో King willum IIII తలభాగం వుంటుంది, క్రింద పేరు వుంటుంది.
అచ్చు భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు, సంవత్సరం ముద్రించేవారు.

నాలుగవ నాణేము ,...అర్థరూపాయి* ( వెండి నాణేము)
దీని బరువు 5.83 గ్రాములు,వ్యాసం 24.6 మిల్లీమీటర్లు
(వివరణ రూపాయి లాగానే)












ఐదవనాణేం,..పావు రూపాయి (వెండి నాణెం)
 ఈ నాణెం 1840 లో వెలువడినప్పటికి కాయిన్ పై 1835 అనే వుంటుంది.
దీని బరువు 2.91 గ్రాములు,వ్యాసం 20 మిల్లీమీటర్లు
(వివరణ రూపాయి లాగానే)

ఆరవ నాణెం  .,.అర్థ అణా  (రాగి నాణెం
దీని బరువు 12.95 గ్రాములు,వ్యాసం 31.2 మిల్లీమీటర్లు 
దీని బొమ్మ భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి లోగో ,సంవత్సరం వుంటుంది.
అచ్చు భాగంలో ఈస్ట్ ఇండియాకంపెనీ పేరు ముద్రించేవారు




ఏడవ నాణెం  .,.పావు అణా  (రాగి నాణెం
దీని బరువు 6.47 గ్రాములు,వ్యాసం 6.47 మిల్లీమీటర్లు
(వివరణ అర్థ అణా లాగానే) 










ఎనిమిదవ నాణెం  .,.1/12 అణా  (రాగి నాణెం
దీని బరువు 2.16 గ్రాములు,వ్యాసం 17.5 మిల్లీమీటర్లు
(వివరణ అర్థ అణా లాగానే)  

(* గుర్తుండేవి నా దగ్గర లేనివి)

26 October 2012

మహాప్రస్థానం


బడుగు బలహీనవర్గాల చైతన్యం కోసం,
పీడిత తాడిత ప్రజల యోగక్షేమాల కోసం,
రాజ్యహింసకు వ్యతిరేఖంగానో,
ఉగ్రవాదాన్ని తుదిముట్టించడానికో,
పోరాటాలు జరుగుతూనే వుంటాయ్.
కళ్లు మూసుకొని బతికేవారో,
ఆశలతో చచ్చేవారో,
ఉపదేశాలతో జనాన్ని నెట్టేవారో,
మహాప్రస్థానమంటూ,
మరోచీకటి వైపుకి పయనించేవారో..
తారసపడుతూనే వుంటారిక్కడ.
కొత్తకొత్త వలలు విసరబడుతుంటాయ్,
నీ బ్రతుకు కోసమే,
కొన్ని మాటలు చెప్పబడుతుంటాయ్.
కాళ్లకింద నలిగిన ఎర్రపుష్పాల పరిమళం,
మత్తుగా నడవమంటుంది,
ఎందుకో,ఒకటర్థంకాదు,
మనకోసమే వచ్చే వాడి,
అసలు వ్యూహాన్ని మనమెప్పడికి చేధించలేమా..
మన జీవితాన్ని మార్చేవాడి,
అసలు రంగుని మనమెప్పడికి, చూడలేమా....
రాజ్యమేలేని రాజ్యం గురించి,
ఇక్కడెవ్వడు మాట్లాడడు.
మా రాజ్యం రావాలనేవాడో,
మనోడు రాజు కావలనేవాడో తప్ప.
రక్తంలో ముంచిన జీవితాలను,
అక్షరాలల్లో కుదించి,
ఇంకొందర్ని కదిలించి,
వారి రక్తం కోసం ఆశగా ఎదురుచూసే వారి
కాలాల్నెందుకు దాటలేక పోతున్నామో....
వాడ్ని చంపింది ఎవరో,
పోస్ట్ మార్టం మాత్రం ఏం చెబుతుంది.
పోలిస్ తూటానో, పదునైన అక్షరమో.
అంతులేని యుద్దాలు నడుస్తూనే వుంటాయ్.
అవును, శాంతి ఇక్కడ విరామం మాత్రమే...
తుదిలేని పోరాటమే శాశ్విత సత్యం,
కారణాలేవైనప్పటికి.
చరిత్ర కొన్ని సార్లు నిజం చెబుతుంది,
మరికొన్ని సార్లు అబద్దమూ చెబుతుంది.
ఎక్కువగా వక్రీకరణా అయుండచ్చు,
కానీ ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతూనే వుంటుంది.
ఆధిపత్యం కోసమో,అనవసరపు సిధ్దాంతం కోసమో..
బలహీనుడెప్పుడూ వేటాడబడుతూనే వుంటాడని,
ప్రతి బలహీనుడు,
 తనకన్నా బలహీనుడ్నే వెతుక్కుంటాడని.

25 October 2012

పిల్లల ట్రెక్కింగ్


కనిగిరి, ప్రకాశం జిల్లాలో ఒక చిన్న స్థాయి పట్టణం. చారిత్రికంగా ఖడ్గతిక్కన యుద్దానికి వచ్చింది. కనిగిరి రాజు కాటంరాజు పైకే,  కాటం రాజుల కాలంలోదాదాపు 400సంవత్సరాల క్రింతం పక్కనే వున్న కొండలలో ఒక దుర్గంన్ని నిర్నించబడింది, దాన్నే లోదుర్గం  అంటారు. ఈ లోదుర్గానికి కనిగిరి నుంచి రెండు మార్గాలు వున్నాయి. వాటిలో ఒక మార్గం ఇది. దసరా శెలవల్లో పిల్లలతో   ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి, ఆ దారిలో కొంత దూరం వెళ్ళి వచ్చాను, ఆ వీడియోనే ఇది, ఇంకో రెండు కిలోమీటర్లు నడవాలి, అక్కడికి వెళ్లాలంటే,...మరోసారి మీకు అసలు లోదుర్గంలో ఏముందో చూపిస్తాను. ఇంకా, నేను కూడా చూడలేదులేండి.

24 October 2012

మనిషి కళ



ఇలానే వుండాలని శాసించేదేదైనా వుందా,
మనల్ని మనమే ఇలా నిర్ధేశించుకుంటున్నామా...
జీవితం, అంత సంక్లిష్టమైనది కాదు,
అని తెలిసికూడా,
ఇలా ఉచ్చులో చిక్కినట్లు,
విలవిల లాడుతుండాల్సిదేనా...
సాధారణమైన బతుకు సత్యాలను,
అసాధారణంగా ఊహించుకొంటూ,
ఇలా బిక్కచచ్చిపోవలసిందేనా....
ఒక మామూలు సరళరేఖను,
లక్ష వక్రాలుగల వృత్తంగా మార్చి,
మెడకు బిగించుకొని,
ఉరికంభానికి వేలాడుతున్నట్లు,
గిజగిజ లాడుతుండాల్సిందేనా....
అలానే బతకడం,
మనిషికి మాత్రమే చేతనయైన,
ప్రత్యేక కళమో,కదా....
దేవుడిచ్చిన ఐదుపైసల పాత్రకి,
వందరూపాయల ఓవరాక్షన్ తో ,
అభాసుపాలైన నాటకం కదూ,.
నేటి మన జీవితం..

20 October 2012

తాలిబాన్లు మీకు ధన్యవాదాలు,



ఒక తుపాకీ గుండుతో
కేవలం ఒక్క ఆడపిల్లపై దాడి చేసి
ఇంత చైతన్యాన్ని రగిల్చినందుకు,
తాలిబాన్లు మీకు ధన్యవాదాలు.

అమ్మకడుపు గడప దాటకుండానే,
ఆడపిల్లలిక్కడ వధించబడుతుంటారు.
బడి నీడన ఎదగకుండా,
తాలిబాన్ తండ్రులు అడ్డుకొంటుంటారు.
యువ తాలిబాన్లు
యాసిడ్ దాడులు చేసేస్తుంటారు.
అత్యాచారాలు జరిపేస్తుంటారు.
తాలిబాన్ సోదరులు
పరువు హత్యలు చేసేస్తుంటారు.
ప్రతి మగాడిలో ఇక్కడ
ఓ తాలిబాన్ నిద్రిస్తుంటాడు
అవసరాన్ని బట్టి స్పందిస్తుంటాడు.

మరంత చైతన్యం కోసం,
స్ఫూర్తివంతమైన మార్గాన్ని నిర్మించడం కోసం,
తాలిబాన్లూ, వీలైతే
మరికొంతమంది మలాలాలను కాల్చేయండి,
అప్పుడైనా ప్రతి ఆడపిల్లకూ,
బడి అవసరం గుర్తొస్తుంది,
జనాలకి వీథికెక్కి ప్రశ్నించే ధైర్యమూ వస్తుంది.

స్వచ్ఛమైన మీ మూర్ఖత్వం,
ప్రపంచానికి మేలే చేసింది,
మీ పాకిస్తాన్ కు మరీ ఎక్కువగా....

ముసుగేసుకున్న మా మూర్ఖత్వం,
నిరంతరం మమ్మల్ని ముంచేస్తూనే వుంది.

మలాలాలున్నారిక్కడా వేలాదిగా,
నీలా ప్రశ్నించేవారో, పోరాడేవారో,
కనీసం వాటికి, అండగా నిలబడేవారో,
ఒక్కరూ లేరనిపిస్తుంది, మలాలా.....
ఇక్కడ పుట్టనందుకు, అభినందనలు.

ఆడపిల్లల చదువు గురించి
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు ఖర్చుపెడితే
ఇంత ప్రచారం సాధ్యమవుతుంది
ఇంత ప్రభావాన్ని చూపగలుగుతుంది,

మాలాలా , నీ రక్తం బొట్టు విలువ
కోటానుకోట్ల ఆడపిల్లల కంటి వెలుగులని,
అర్థమయ్యే వుంటుంది నీకీపాటికే

అందుకే ఆసుపత్రి మంచంపై
ప్రశాంతంగా కనిపిస్తున్నావ్,
నీ లక్ష్యాన్నిక్కడ పరుగులుతీయిస్తున్నావ్.

నిశ్చయంగా తెలుసు నాకు,
నీవు నవ్వుతూ బయటకొస్తావ్,
నిర్భయంగా సంచరిస్తావ్.
శాంతి దూతవై విహరిస్తావ్.

మలాలా చనిపోకుండా కాల్చినందుకు.
తాలిబాన్లూ మరొక్కసారి ధన్యవాదాలు మీకు,