Pages

20 November 2015

తొండమనాడు (thondamanadu)


                                                  అది ఒకప్పుడు 18 సంవత్సరాల యుద్ధంలో పల్లవులపై  చోళులు విజయం సాధించినప్రాంతం. తొండమండలం గా చరిత్రలో ప్రసిద్ధి చెంది, తొండమాన్ చక్రవర్తి తన భక్తితో శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా అక్కడే వెలిపింప చేసుకున్న ప్రాంతం. తొండమాన్ చోళుల రాజధానిగా కోట అని పిలువబడిన ప్రాంతం.

తొండమనాడు, శ్రీ కాళహస్తికి 8కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న గ్రామం ప్రస్తుతం.
సరే,  ప్రక్కనున్న తిరుమలను, శ్రీ కాళహస్తిని, గుడిమల్లం లను( ఇంతకు ముందు చూసినవే అనేదో కారణం) కాదని ఈ ప్రాంతాన్ని ఓ ఉదయపు సందర్శనకు ఎందుకు ఎంచుకోవల్సివచ్చిందంటే, తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో ఇచ్చిన పదో శతాబ్ధపు ముందటి చారిత్రిక కట్టాడలలో ఈ ఊరికి స్థానం కల్పించడం వలన. ఏ దేవాలయమో పేరు ఇవ్వలేదు కాని, ఆ పుస్తకంలో శిల్పం అనే 21వ అధ్యాయంలో డి. కిరణ్ క్రాంతి చౌదరి గారు ఇలా రాశారు.
                                       " దిగువ నైఋతి ఆంధ్ర దేశంలో శ్రీకాళహస్తి సమీపాన ఉన్న తొండమనాడులో చోళ సంప్రదాయం కనిపిస్తుంది. క్రీ.శ తొమ్మిదవ శతాబ్థి చివరిపాదంలో ప్రథమ ఆదిత్య చోళుని దండయాత్రతో తొండమనాడులో చోళరాజ్య వ్యాప్తి జరిగింది. అతని కుమారుడు ప్రథమ పరాంతకుడు(క్రీ.శ 907-955) తొండమనాడు వద్ద ప్రథమ ఆదిత్య చోళుని గౌరవార్థం పల్లిప్పడియ నిర్మించాడు. దక్షిణదిశలో గణపతి దక్షిణామూర్తి, పశ్చిమంలో విష్ణువు, ఉత్తరదిశలో దుర్గ, బ్రహ్మల కోష్టదేవతా శిల్పాలు ఉన్నాయి. పై భాగంలో మకర తోరణం లేకుండా సాదా ఉల్భణకోష్టం ఉంది. కోష్టదేవతలు బరువైన శరీర లక్షణాలను కలిగి వున్నారు.  గుండ్రటి ముఖాలు, పొట్టి చుబుకం, తేరిపారచూసే శూన్యనేత్రాలు, బాగా వంపు తిరిగిన కనుబొమ్మలు, చదునైన రూపీకరణ, బిరుసైన ముందు భాగం వీటి లక్షణాలు. చోళ సంప్రదాయ మౌళికత వీటిలో లేదని మాత్ర చెప్పవచ్చు."

                              ఇంతకు మించిన వివరాలు పోగుచేసుకోలేక పోయినప్పటికి ఊర్లో కనుక్కుంటే ఆ గుడి గురించి ఎవరైన చెబుతారు కదా, అని రేణిగుంట నుంచి బస్సులో తొండమ నాడు క్రాస్ వద్ద  ఉదయం 6.30 కల్లా దిగడం జరిగింది. 
( ఎవరైన వెళ్లాలనుకుంటే శ్రీకాళహస్తి నుంచి వెళ్లడం సులభమని గుర్తుంచుకోండి)

                                         అక్కడికి దాదాపు ఒకటున్నర కిలోమీటర్ల దూరంలో వున్న  గ్రామంలోకి స్వాగతం చెబుతూ, పెద్ద ద్వారము, మరియు  ఒక స్థూపము కనిపిస్తాయి. ఆ స్థూపాన్ని 2005 వ సంవత్సరంలో, అదే స్థలం వద్ద జరిగిన చోళ - పల్లవుల యుద్దానికి గుర్తుగా  దీన్ని నిర్మించారట.  దాదాపు 18 సంవంత్సరాల కాలం ( క్రీ.శ 885 నుండి 903 వరకు) జరిగిన ఈ యుద్దంలో పల్లవ రాజైన అపరిజిత, చోళరాజైన ఆదిత్య చోళుడి చేతిలో ఓడిపోయాడట. ఆ విధంగా ఈ ప్రాంతంలో చోళరాజ్య స్థాపన జరిగినట్లు చరిత్ర చెబుతుంది.



ఆ క్రాస్ లోనే ఓ బోర్డు పైన గ్రామంలోని దేవాలయాల వివరాలు వున్నాయి.
1) ప్రసన్నవెంకటేశ్వర స్వామి దేవాలయం
2) కోదండ రామేశ్వర స్వామి దేవాలయం (బొక్కసం పాళెం)
3) పుట్టాలమ్మ దేవాలయం

1) ప్రసన్నవెంకటేశ్వర స్వామి దేవాలయం
                                                        బైక్ లో లిఫ్ట్  ఇచ్చిన అతను  చెప్పిన దాని ప్రకారం, ఊరి సెంటర్ నంచి ఓ అరకిలోమీటరు నడిచి,మొదట ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం కి చేరుకున్నాను.  గుడికి ముందుగానే  టి.టి.డి వారు నిర్మించిన  ఓ  మూడు  అంతస్తుల వసతి గృహాన్ని, పిల్లలపార్కుని, పెద్ద కల్యాణ మండపాన్ని గమనించవచ్చు( ప్రస్తుతం అన్నీ నిరుపయోగంగా వున్నట్లనిపించాయి)

                                            ఈ దేవాలయాన్ని టి.టి.డి వారు పూర్తిగా తీసివేసి ఆ శిధిలాలు మరియు కొత్త రాళ్లతో కలిపి నూతనంగా నిర్మిస్తున్నారు. లోపల కొన్ని స్తంభాలు పాతవి కనిపిస్తాయి. ముందు వరండా అంతా సిమెంట్ తో స్లాబ్ వేసారు.  లోపల స్తంభాలపై అక్కడక్కడ కొన్ని శాసనాల వాక్యాలు కనిపిస్తాయి. పక్కనే వున్న చిన్న రూమ్లో, ప్రధాన విగ్రహాలను ఉంచి పూజలు జరుపుతున్నారు. దాదాపు రెండున్నర అడుగులు వుండే వెంకటేశ్వర స్వామి,తన ఇద్దరిదేవేరులతో కొలవైవుంటాడు ఇక్కడ.దీనికి సంబంధించిన విషయాలు వున్న ప్లెక్సీ ఒకటి తలుపుకి తగిలించివున్నారు. దానిలో విషయాలు ఇలా వున్నాయి.
      ఆకాశరాజు, తొండమానుడు అన్నదమ్ములు. వెంకటేశ్వర స్వామితో, ఆకాశరాజు కూతురు పద్మావతి వివాహము అయిన తరువాత, తొండమానుడు కి  రాజ్య పంపకాలలో ఈ ప్రాంతం వస్తుంది. అందువలననే తరువాత  కాలాలలో ఇది తొండమండలంగా ప్రసిద్ది చెందిది. ఈ తొండమానుడు వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో సేవించేవాడు. వయసు మీరి, ముసలి వాడై తిరుమలకు వెళ్లలేని అశక్తతను స్వామి వారితో వ్యక్తం చేసినప్పుడు, స్వామి వారు అభయ హస్తంతో, కూర్చున్న భంగిమలో శ్రీదేవి, భూదేవి సమేతంగా అతని ఇంటనే వెలుస్తాడు. అదే ఈ గుడి.
                                             దీనిలో చారిత్రక అంశాల ప్రాధాన్యత కొంత తక్కువగానే కనిపిస్తున్నప్పటికి, వరాహపురాణంలోని ఈ కథే చాలా వరకు ప్రచారమై వుంది. వీరు చోళ రాజులుగానే కనిపిస్తారు ఈ కథలో కూడా.
 పూర్తిగా కొత్త దేవాలయంగా మార్చబడిన ఈ గుడిలో ప్రాచీనత ఆనవాలు పట్టడం ఇక  కష్టంగానే అనిపిస్తుంది. ఆర్కియాలజీ వారి పాత్ర ఇక్కడ మనకేమీ కనబడదు. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోనే నూతన గుడి నిర్మాణం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ( 7.30)                                       ప్రసన్నవెంకటేశ్వర స్వామి దేవాలయం ఫోటోల కోసం క్లిక్ చేయండి

2) కోదండ రామేశ్వర స్వామి దేవాలయం (ఆదిత్యాలయం)

                                                                    తొండమనాడు గ్రామానికి పక్కనే వున్న బొక్కసం పాలెంలో  ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపు ఒక కిలోమీటరు దూరాన ఈ దేవాలయం వుంది.  నేను చూడాలని వెళ్ళిన చోళులు నిర్మించిన  దేవాలయం ఇదేనని నాకు అప్పటికి తెలియదు.                                              చారిత్రకంగా అత్యంత పాధాన్యత కలిగిన ఈ దేవాలయాన్ని కూడా టి.టి.డి వారు పూర్తిగా మళ్లీ నిర్మించారు. ఈ నిర్మాణం దాదాపు పూర్తై కొత్త దేవాలయంలానే ఇది కనిపిస్తుంది. ఇది జంట దేవాలయాల సముదాయం, శివాలయం, పక్కనే పార్వతి దేవాలయం.  అందమైన భారీ గాలిగోపురం, చిన్న నంది మండపం, తులసి కోట ఇటుకలతో నిర్మించిన ఓ భావి, ఒక మూలగా నవగ్రహ మండపం, విశాలమైన ఆవరణ. అక్కడక్కడ గోడలపై కొన్ని శాసనాలు, చిన్న విగ్రహాలు తప్ప మిగతావన్నీ కొత్తవిగానే అనిపిస్తాయి. పునర్ నిర్మాణం దాదాపుగా పూర్తైన ఈ ఆలయంలో ఇంకా పూజలు మొదలుకాలేదు. శివలింగం మరియు నందిపై వస్త్రం కప్పివుంచారు.
                                                  ప్రథమ పరాంతకుడు(క్రీ.శ 907-955) తన తండ్రి ఆదిత్యచోళుని జ్ఞాపకార్థం నిర్మించిన ఆదిత్యాలయం ఇది. తరువాతి కాలాలలో దీని పేరు మారినట్లుంది.  దీన్ని పల్లిపాడై అని పిలవడానికి కారణం, ఈ దేవాలయం ప్రథమ ఆదిత్య చోళుని అస్థికలపై నిర్మిచబడటమే(బౌద్ద స్థూపాలలాగా).  సమాధులపైన నిర్మించబడ్డ  తక్కువ ఆలయాలలో ఇది ఒకటి(రామనాథపురం లోని సుందర పాండ్య ఈశ్వరాలయం ఇలాంటిదే ).  ఇక్కడ అనేక చోళ శాసనాలు దొరికినట్లుగా చెబుతున్నారు.  ఇది ప్రధానంగా శైవంలోని మహావ్రతులు ఆధీనంలో వున్నట్లు తెలుస్తుంది.  ఆ కాలంలో శైవంలోని భిన్న శాఖలైన పాశుపతులు, కాలాముఖులు , నిరాశ్రయులు,మహాపాశుపతుల వంటి శాఖల పేర్లు కూడా ఇక్కడ దొరికిన శాసనాలపై కనిపిస్తాయట.  కాలముఖు పూజారులనే మహావ్రతులు అని పిలిచే వారని కొంత మంది అంటారు. మరొక శాసనం వెయ్యిమంది భక్తుల అన్నదానం కోసం కావలసిన కానుకలను ( వీరిలో 300 మంది బ్రాహ్మణులు, భిన్నమతాల వారు 500 మంది, 200 మంది శైవ మునులు) మహా వ్రతులు నాయకుడైన వాగీశ్వర భట్టారకుడికి  ఇచ్చినట్లు తెలుపుతుంది.
                             మొత్తంమ్మీద  ప్రథమ పరాంతక చోళుడు (క్రీ.శ 907-955)  శైవాన్ని విశేషంగా ఆదరించినట్లు చెప్పడానికి ఈ దేవాలయం సాక్ష్యంగా నిలుస్తుంది. గాలి గోపురం తరువాత కాలంలో వేరేవారు నిర్మించినట్లుగా అనిపిస్తుంది.  దాని సమాచారం నాకు దొరకలేదు.
                                      ఈ దేవాలయం పక్కనే టి.టి.డి వారు దాదాపు 40లక్షల ఖర్చుతో నిర్మించిన వసతి గృహం తాళం వేసి కనిపిస్తుంది.


                                     ఊరికి బొక్కసం పాళెం అని పేరు రావడానికి,  ఆ  ప్రాంతం ఒకప్పుడు స్మశానం అయ్యివుండటానికి సంబంధం వుందేమో, మా ప్రాంతాల్లో కొన్ని చోట్ల స్మశానాన్ని బొక్కల గడ్డ అని పిలుస్తుంటారు. దీనిపైన ఎవరైన శోధించవచ్చు. ( ఈ పాటికే చేసి వుంటే వాటి వివరాలను కనుక్కోవచ్చు)
                                                    దేవాలయం ఎదురుగా వున్న రావి చెట్టు క్రింద నాగశిలను చూసి, అక్కడ నుండి మళ్లీ సెంటరుకొచ్చి టిఫిన్ చేసి, ఒక కిలోమీటరు దూరం వున్న పుట్టాలమ్మ దేవాలయానికి నడక ప్రారంభించాను(8.30)

3) పుట్టాలమ్మ దేవాలయం
                                                                 నేను ఈ దేవాలయం సమయం లేకపోవడం వల్ల చూడలేక పోయాను. దీనికి కారణం దీనికి ముందుగా కనిపించిన ఓ శిధిల ఆలయం, అదే ధర్మరాజు ఆలయం.

                                      పుట్టాలమ్మ దేవాలయం, ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ది చెందినట్లుగా అనిపించింది. మిగతా ఆలయాలతో పోలిస్తే జనం తాకిడి కూడా ఇక్కడ ఎక్కువలా అనిపించింది. బహుశా గ్రామదేవత అయ్యివుండటం వలన. మరోసారెప్పుడన్నా వీలైతే  ఈ దేవాలయాన్ని చూడాలి.

4) ధర్మరాజు ఆలయం

                               ఇది చూడగానే, నేను చూడాలనుకున్న చోళుల ఆలయం అనుకున్నాను(కానీ  కాదనుకోండి).  ఎక్కువ భాగం ఇటుకలు, సున్నంతో నిర్మితమై,  కేవలం స్లాబ్ లో, ముందు పక్కన వున్న నాలుగు స్తంభాలు మాత్రమే రాతివి.  నేను వెళ్లే సమయానికి ఒక పూజారి దీపం వెలిగిస్తున్నాడు. లోపల ఒక రాతి విగ్రహం, ఒక చెక్క విగ్రహం వున్నాయి. ఒక అరుగు లాంటి దానిపై అవి వుంచబడినవి.  చరిత్ర గురించి తనకు తెలియదని చెప్పాడు. ప్రకాశం జిల్లాలో పిటికాయగుళ్లలోని 8వ శతాబ్థానికి చెందిన పిటికేశ్వరస్వామి ఆలయాలను పోలివున్న ఇది, అదే కాలానిదై వుంటుందేమో అనుకున్నాను, నేను.  కాని దీనికి సంబంధించిన సమాచారం దొరకలేదు.
                                గోపురం పై చాల చక్కని శిల్పాలను, నిర్మాణాన్ని కలిగివుండి, చూడగానే ఆకట్టుకుంటుంది.  ఈ చిన్న ఆలయం. చుట్టూ ఆక్రమణలతో, నిర్లక్యంచేయబడటం వలన అది ఒక డంప్ యార్డ్ లా అనిపిస్తుంది. చూట్టు వున్న గోడల్లో ఏ గోడ మనకు పూర్తిగా కనబడదు. 
                        ధర్మరాజు ఆలయం ఫోటోల కోసం క్లిక్ చేయండి
                     ముందు వరండా(15*10), తరువాత ఓ గది(10*8), ఆ తరువాత గర్భగుడి(10*8) వున్న ఈ ఆలయాన్ని త్వరలో పూర్తిగా కూల్చి, కొత్త ఆలయాన్ని కట్టే ఉద్దేశ్యం వున్నట్లు పూజారి మాటలను బట్టి అర్థమవుతుంది. ఆర్కియాలజీ వారు, దీన్నికొంత పట్టించుకుంటే, ఈ ఆలయం ఏ కాలానకి చెందినదో, ఎవరు నిర్మించారో లాంటి విషయాలు. ఇంకొన్ని కొత్త సంగతులు ఏమన్నా బయటకు రావచ్చు. ఆ ప్రాంతంలో ఎవరన్నా చరిత్ర పట్ల ఆసక్తి వున్నవారు దీనిపైన దృష్టిపెడితే, ఈ ఆలయం ఇంకొంత కాలం మనగలిగే అవకాశం వుంది( 9.30)
                                                    తిరుపతి లో సైన్స్ వర్క్ షాప్ కి 10.30 కి హాజరు కావల్సినందున ఇక అక్కడినుంచే వెనక్కి రావడం జరిగింది.  

సూచనలు

సొంత వెహికల్లో వెళ్తే తొందరగానే చూడవచ్చు. లేకపోతే ఓ మూడు కిలోమీటర్లన్నా నడవడానికి సిద్దంగా వుండాలి.
తొండమనాడుకి  దగ్గరలో వున్న బత్తిమల్లయ్యకోనలో కూడా ఓ చూడదగ్గ టెంపుల్ వుందట, వీలైతే దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి.
  ********                                                ఎక్కువ చారిత్రక ఆసక్తో లేదా ఆ ఊరి దేవాలయాలపై ప్రత్యేకమైన భక్తో ఉంటేనే  తొండమనాడు ట్రిప్ ఆనందదాయకంగా వుంటుంది.  2/5