Pages

17 July 2015

పాతాళానికి ప్రయాణం

ఎ జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ద ఎర్త్,. 


జూల్స్ వెర్న్,1864 లో ఫ్రెంచ్ లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. చెన్నై ఐఐటిలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీనివాస చక్రవర్తి , ఈ  సైఫై ( సైన్స్ ఫిక్షన్) క్లాసిక్ నవలను తెలుగు పాఠకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో, ఈ పూర్తి నవలను తెలుగులో అనువదించారు. దీన్ని జనవిజ్ఞానవేదిక, మంచిపుస్తకం వారు ప్రచురించారు. ఇది వరకే ఈ పుస్తక సంక్షిప్త అనువాదాలు తెలుగులో వచ్చినప్పటికి, పూర్తి స్థాయి అనువాదంగా దీన్ని చెప్పుకున్నారు అనువాదకులు.  తెలుగులో ఇప్పటికి ఓ మంచి సైన్స్ ఫిక్షన్ నవలను మనం చూడలేదంటే అందులో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఈ మంచి ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఆసక్తికరంగా అనువదించిన ఈ నవలలోకి ఒక్కసారి తొంగిచూద్దాం.
ప్రధాన పాత్రలు - స్వభావాలు
1) ఫ్రొఫెసర్ ఒట్టో లీడెన్ బ్రాక్ కోపం, అసహనం, జ్ఞానం మూర్తిభవించి, ఏ పరిస్థితులకు చలించకుండా తాను అనుకున్నదానికి కట్టుబడే వ్యక్తి. ప్రముఖ శాస్త్రవేత్త, జియాలజిస్ట్.
2) ఏక్సెల్:  ఫ్రొఫెసర్ గారి (పెంపుడు) మేనల్లుడు, చాలా సాధారణమైన వ్యక్తి,  సాహసయాత్రల పట్ల విముఖత, చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోతాడు, సున్నితుడు, గ్రౌబెన్ ప్రేమికుడు
3) హన్స్ బైకి:   ఐస్లాండ్ లో వీరి యాత్రకు  అత్యంత విధేయుడైన గైడ్, దృడచిత్తుడు,
4) గ్రౌబెన్ : ఫ్రొఫెసర్ గారి పెంపుడు కూతురు, ధైర్యస్తురాలు. ఏక్సెల్ ను యాత్రకు ఉత్తేజితుడిని చేసే ప్రయత్నం చేస్తుంది. ( పరిమితమైన పాత్ర)

జర్మనీలోని హాంబర్గ్ పట్టణలో మే, 14, 1863 లో ఈ కథ మొదలవుతుంది, ఆగస్ట్ 29,30(?)ఇటలీలోని చిన్న ద్వీపమైన స్ట్రాంబోలిలో ముగుస్తుంది.

 ఈ వైజ్ఞానిక సాహస యాత్ర  ఆనాటికి ప్రసిద్ధమైన అనేక సాంకేతిక, భౌగోళిక అంశాలను ప్రమాణికంగా తీసుకొని ముందుకు సాగుతుంది.
ఈ నవలంతా ఏక్సెల్  తన మాటల్లో చెప్పుకుంటు పోతుంటాడు, సంక్షిప్తంగా కథ ఇలా సాగుతుంది.

ప్రొఫెసర్ గారు కొన్న ఓ పాతపుస్తకంలో  16వశతాబ్థానికి చెందిన ఐస్లాండ్ ఆల్కెమిస్ట్, పండితుడు ఆర్నే సాక్నుసెం రూనిక్ భాష లో రాసి  వున్న చిన్నసంకేత ప్రాచీన రాతప్రతి దొరుకుతుంది ( మే 14).

 దానిలో ఐస్లాండ్ లోని నిద్రాణస్థితిలోని స్నెఫెల్ అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భూమి మధ్య భాగానికి దారివుంది అని వుంటుందని  డీకోడ్ చేస్తారు. ఇక ఫ్రొఫెసర్ గారు వెంటనే ఏక్సెల్ ను వెంట తీసుకొని (మే16)  ఐస్లాండ్ బయలుదేరతారు.  హాంబర్గ్ నుండి కేల్ వరకు రైల్లో, అక్కడ నుండి కొపెనహెగన్( డెన్మార్క రాజధాని) కు ఎల్నోరా ఓడలో వెళ్తారు.ఓ వారం విడిది అనంతరం జూన్ 2వ తేది  వల్కీరా అనే ఓడలో స్కాట్లాండ్, ఫారోస్ దీవుల మీదుగా 13తేదికి ఐస్లాండ్ రాజధాని రిజోవిక్ కు, చేరుకుంటారు. 

 స్థానిక ఫ్రోఫెసర్ ఫ్రెడరిక్సన్ వీరికి అతిధ్యం ఇచ్చి, హన్స్ అనే వేటగాడిని, ఈ యాత్రకు మార్గదర్శకుడిగా కొంత జీతానికి కుదిరిస్తాడు.
జూన్ 16వ తేది, రిజోవిక్ నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని స్నెఫెల్ అగ్నిపర్వతం వద్దకు ప్రయాణం మొదలుపెడతారు. మరో ఇద్దరి సహాయకులను తీసుకుని గుర్రాల సహాయంతో నడుచుకుంటూ, గర్దార్, స్టాపీ అనే ఊర్లమీదుగా స్నెఫల్ పర్వతాన్ని అధిరోహించి, జూన్ 25 నాటికి, ఆ అగ్ని పర్వత బిలం వద్దకు చేరుకుంటారు.

ఇక, సహాయకులు వెనుతిరిగిన తరువాత, ఈ ముగ్గురు ఆ బిలం నుంచి పాతాళానికి అవరోహణ సాగిస్తారు.

 కొన్ని సార్లు దార్లు తప్పుతూ, మంచినీటికై అలమటిస్తూ, బయటపడతామో లేదో తెలియని చిత్రవిచిత్ర పరిస్థితుల్లో ఆ కాలానికి పాచుర్యంలో వున్న వివిధ సిద్దాంతాలను చర్చించుకుంటూ, భూగర్భంలోని సముద్రాలను, జీవరాశుల్ని సంభ్రమాశ్చార్యాలతో చూసుకుంటూ అనేక సాహసల అనంతరం చివరకు అదృష్టవశాత్తూ,  మధ్యధరా సముద్రంలోని స్ట్రాంబోలి అనే దీవిలో వున్న ఓ అగ్నిపర్వతం ద్వారా బయటకు విసిరివేయబడతారు.

 



వీరు భూకేంద్రానికి వెళ్లారో లేదో చెప్పలేదు కాని, ఆద్వంతం ఆసక్తిని రేకేత్తిస్తూ, విజ్ఞాన శాస్త్ర విషయాలను చర్చిస్తూ నడిచే కథా,కథనం పిల్లల్నే కాదు, పెద్దలను కూడా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. సైఫై నవలల్లో గొప్పగా కీర్తించబడే ఈ నవల అనేక సినిమాలకు,
 సాహసయాత్రలకు  స్పూర్తిగా నిలిచింది.
234పేజీలు, 110 రూపాయల వెలతో వున్న ఈ పుస్తకం ఫస్ట్ రీడింగ్ టైమ్ 2నుంచి 3గంటలు. ఈ పుస్తకం కావలసినవారు సంప్రదించాల్సిన చిరునామా
 జనవిజ్ఞానవేదిక, జి.మాల్యాద్రి, 162, విజయలక్ష్మీనగర్,నెల్లూరు - 524004,ఫోన్. 9440503061.
(లేదా) మంచిపుస్తకం, 12-13-439, వీథినెం.1, తార్నాక, సికింద్రాబాద్- 500017 ఫోన్ .9490746614.
ఏవైనా గవర్నమెంట్ పాఠశాలలు అనువాదకులు వి. శ్రీనివాస్ చక్రవర్తిగారిని సంప్రదిస్తే,. స్కూల్ లైబ్రరీ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పుస్తకంతో పాటు మరికొన్ని పుస్తకాలను ఉచితంగా పంపుతున్నారు. వారి బ్లాగ్  లింక్  ఇది.
పాతాళానికి ప్రయాణం వారి బ్లాగ్లో కూడా చదవచ్చు, దాని లింక్

ఈ బుక్ కావాలనుకుంటే కినిగే లింక్

2 comments:

  1. పుస్తకాన్ని చాలా చక్కగా పరిచయం చేశారు!

    ReplyDelete